పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని రామాంజన కె. డాక్టరేట్ కు అర్హత సాధించారు. సాగే ఉపరితలాలపై పోరస్ మాధ్యమం ద్వారా కాసన్ ద్రవ ప్రవాహాలపై అయస్కాంత క్షేత్ర ప్రభావాలు అనే అంశంపై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ గణిత శాస్త్ర విభాగం పూర్వ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.అరుణ గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.డాక్టర్ రామాంజన పరిశోధన సజాతీయ పోరస్ మీడియాలో పొందుపరిచిన స్ట్రెచింగ్ షీట్లపై కాసన్ ఫ్లూయిడ్ ప్రవాహాల ప్రవర్తనపై దృష్టి పెట్టిందని తెలిపారు. ఈ అధ్యయనం సోరెట్, డుఫోర్ ప్రభావాలు, ఉష్ణ వికిరణం, ఉష్ణ వనరులు, సింకులు, రసాయన ప్రతిచర్యలతో సహా వివిధ డైమెన్షన్ లెస్ పారామితులను నిశితంగా విశ్లేషించిందన్నారు. షూటింగ్ టెక్నిక్ తో కలిపి సారూప్య పరివర్తనలు, రంజ్-కుట్టా నాల్గవ-ఆర్డర్ పద్ధతిని ఉపయోగించి, ఆమె పని వేగం, ఉష్ణోగ్రత, ఏకాగ్రత ప్రొఫైళ్లపై భౌతిక పారామితుల ప్రభావంపై విలువైన ఫలితాలను అందించినట్టు వివరించారు.డాక్టర్ రామాంజన సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. డాక్టర్ రామాంజన సాధించిన విజయం ఎంతో గర్వంగా ఉందని, విద్యా, పరిశోధన ప్రయత్నాలలో ఆమె నిరంతర విజయం సాధించాలని వారు అభిలషించినట్టు తెలియజేశారు.
