పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
దేశంలోని బడుగు బలహీన వర్గాలకు సమాన హక్కులు సాధించడంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని.. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకొని.. పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే జిఎంఆర్ పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో అసమానతలు రూపుమాపి అందరికీ సమ న్యాయం అందించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. చిన్న రాష్ట్రాల ద్వారానే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్న అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని తెలిపారు.. నేటితరం యువత అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో.. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, పటాన్చెరు సిఐ వినాయక్ రెడ్డి, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, వెంకటేష్, నర్రా బిక్షపతి, వివిధ దళిత సంఘాల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.