రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు కార్యకర్తల కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల చెక్కుల పంపిణీ

Districts politics Telangana

_టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ,పటాన్ చెరు:

దేశంలోని మొట్టమొదటి సారిగా కార్యకర్తలకు ప్రమాద బీమా చేయించి, ప్రమాదవశాత్తు మృతి చెందితే రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్న ఏకైక పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని జిన్నారం మండలం కిష్టయ్య పల్లి గ్రామానికి చెందిన కొడకంచి రామకృష్ణ, బొల్లారం మున్సిపాలిటీ బి.సి కాలనీకి చెందిన సత్యనారాయణలు టిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పని చేస్తున్నారు. ఇటీవల వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. టిఆర్ఎస్ పార్టీ అందించిన బీమా సౌకర్యం కలిగి ఉండటంతో, ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా మంజూరైంది.

ఈ మేరకు శనివారం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ కార్యకర్తల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి భీమా సౌకర్యం అందించడం జరిగిందన్నారు. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకునే ఏకైక పార్టీ టిఆర్ఎస్ అన్నారు. కార్యకర్తల సమిష్టి కృషితోనే నేడు టిఆర్ఎస్ పార్టీ రెండుసార్లు అధికారం చేపట్టిందనీ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల మంది కార్యకర్తలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి కెసిఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొల్లారం మున్సిపల్ కౌన్సిలర్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, రెండో వార్డు కౌన్సిలర్ గోపాలమ్మ, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *