వైద్యంలో రసాయన, జీవశాస్త్రాల పాత్రపై చర్చాగోష్ఠి

Telangana

ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ ప్రొఫెసర్ రెనే గ్రీ

సెమినార్ ను ప్రారంభించిన ఐఐసీటీ పూర్వ డైరెక్టర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ‘

వైద్యానికి సంబంధించిన పదార్థాలు: రసాయన, జీవ శాస్త్రాల పాత్ర’ అనే అంశంపై గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లో బుధవారం చర్చాగోష్ఠిని నిర్వహించారు. ప్రముఖ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలను ఒకచోట చేర్చి, వైద్య శాస్త్రాన్ని అభివృద్ధి చేయడంలో, సామాజిక సవాళ్లను పరిష్కరించడంలో రసాయన, జీవ శాస్త్రాల యొక్క పరివర్తన పాత్రను అన్వేషించడానికి వీలు కల్పించారు.ఫ్రాన్స్ లోని రెన్నెస్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్, సీఎన్ఆర్ఎస్ రీసెర్చ్ డైరెక్టర్ ఎమిరిటస్ ప్రొఫెసర్ రెనే గ్రీ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ‘పరిశోధనలో ఆవిష్కరణ యొక్క కీలక పాత్ర’ అనే అంశంపై ప్రారంభోపన్యాసం చేశారు. శాస్త్రీయ ఆవిష్కరణలో కాకతాళీయంగా కలిసొచ్చిన అదృష్టం (సెరెండిపిటీ), ఉత్సుకత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, శాస్త్రీయ పరిశోధనకు ఫ్రాన్స్ లోని పరిశోధనావకాశాలను వివరించారు. బయోమెడికల్ పరిశోధన, మానవ ఆరోగ్య సంరక్షణలో దాని సామర్థ్యాన్ని నొక్కిచెప్పే సీఎల్ కే (CLK) కినేస్ ల నూతన, అత్యంత ఎంపిక చేసిన నిరోధకం అయిన డీబీ18 ఆవిష్కరణపై ప్రొఫెసర్ గ్రీ లోతైన అవగాహన కల్పించారు.

ఐఐసీటీ మాజీ డైరెక్టర్, గీతం విశిష్ట ప్రొఫెసర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ అతిథులను స్వాగతించగా, పై ల్యాబ్స్ కు చెందిన డాక్టర్ ప్రథమ మాట్లాడుతూ, పరిశోధకులతో చురుకుగా సంభాషించాలని, సైన్స్ ను కెరీర్ మార్గంగా ఎంపిక చేసుకోవాలని విద్యార్థులను ప్రోత్సహించారు.‘కొత్త ఆహార అభివృద్ధి, కాలుష్య కారకాల పర్యవేక్షణ’ అనే అంశంపై సీసీఎంబీలోని బయాలజీ శాస్త్రవేత్త డాక్టర్ లాబన్యామోయ్ కోల్ ప్రసంగించారు. ‘సుస్థిర సమాజం కోసం స్టీరియో కెమిస్ట్రీ, సింథటిక్ పద్ధతుల అభివృద్ధి ప్రభావం’ అనే అంశంపై హైదరాబాదు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎ.కె.సాహూ ఉపన్యసించారు. గీతం సైన్స్ డీన్ ప్రొఫెసర్ ఎస్. అనంత రామకృష్ణ తన దృక్పథాలను ఆన్ లైన్లో పంచుకున్నారు. గీతంలో నెలకొల్పిన అత్యాధునిక MURTI ప్రయోగశాలలను అతిథులంతా సందర్శించి, అక్కడ పరిశోధనలు చేస్తున్న అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్లతో సంభాషించారు.స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రెజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ గౌసియా బేగం, ఫుడ్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ నిహారిక పరిశోధనా సౌకర్యాల ప్రాముఖ్యతపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

కార్యక్రమ నిర్వాహకులు, సహ-నిర్వాహకులు ప్రొఫెసర్ రాంబాబు గుండ్ల, డాక్టర్ పూర్ణచంద్రరావు, డాక్టర్ శివకుమార్ ఇందులో అతిథులుగా పాల్గొన్న, దీనిని సద్వినియోగం చేసుకున్న వారందరికీ కృతజ్జతలు తెలియజేశారు.ప్రశంసా పత్రాల పంపిణీతో ముగిసిన ఈ సెమినార్ లో దాదాపు 150 మంది విద్యార్థులు, 20 మంది పరిశోధనా స్కాలర్లు పాల్గొని అత్యాధునిక శాస్త్రీయ పురోగతిపై లోతైన అవగాహనను ఏర్పరచుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *