భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్
మనవార్తలు ప్రతినిధి , గుమ్మడిదల :
గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలోని సర్వే నెంబరు 109 లో పరిశ్రమల స్థాపన కోసం భూములు అందించిన ప్రతి రైతుకు 100 గజాల ఇళ్ల స్థలం కేటాయించాలని కోరుతూ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్ తో కలిసి కలెక్టర్ కు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలోని సర్వే నెంబర్ 109లో గల సుమారు 160 ఎకరాల భూమిని పారిశ్రామిక మౌలిక సదుపాయాల కోసం సేకరించిన సమయంలో రైతులకు నష్టపరిహారంతో పాటు ప్రతి ఒక్కరికి వంద గజాల నివాస స్థలం ఇస్తామని అప్పటి కలెక్టర్ వల్లూరు క్రాంతి సమక్షంలో హామీ ఇచ్చినట్లు తెలిపారు. హామీ ఇచ్చి సంవత్సరం గడుస్తున్న నేటి వరకు ప్లాట్ల కేటాయింపు జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్లాట్ల కోసం ఐదు ఎకరాల స్థలాన్ని గుర్తించిన విషయాన్ని రైతులు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. అయితే ఆ స్థలాన్ని కూడా పరిశ్రమలకు కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అలాంటి చర్యలు తీసుకుంటే తీవ్రంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ప్లాట్ల కేటాయింపును త్వరితగతిన చేయాలని కోరారు. ఈ సమస్యపై అధికారులతో చర్చించి ప్రతి బాధితుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు యాదగిరి, వెంకట్రంరెడ్డి, హుస్సేన్ బాధిత రైతులు తదితరులు పాల్గొన్నారు.
