పటాన్ చెరు జాతీయ రహదారిపై కాంగ్రెస్ శ్రేణుల నిరసన

politics Telangana

-సీఎం ఫోటో పెట్టని ఎమ్మెల్యే మాకొద్దు 

– ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి

– పటాన్ చెరు లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం.

– మహిపాల్ రెడ్డి డౌన్ డౌన్, గో బ్యాక్, సేవ్ కాంగ్రెస్ నినాదాలతో నిరసన చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు.

– పటాన్ చెరులో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తున్నాడంటూ ఆవేదన

– ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ ఫోటో తీసేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఇటీవల బొల్లారం మున్సిపాలిటీలో జరిగిన సంఘటనను నిరసిస్తూ, నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిరసనకు దిగారు. ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరుతూ పటాన్ చెరు పట్టణంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుండి కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

జాతీయ రహదారిపై బైఠాయించి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి డౌన్ డౌన్ సేవ్ కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.అన్నింటిలో బీఆర్ఎస్ నాయకులను ప్రాధాన్యత ఇస్తున్నాడని ఆరోపంచారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయంలో దూసుకెళ్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ పలువురు కార్యకర్తలు లోపలికి వెళ్లి మాజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టారు.

ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రజాపతినిధులు, నాయకులను నిర్లక్ష్యం చేస్తూ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం సైతం ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులతో కార్యక్రమాలు చేపడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన మహిపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు పెట్టడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల బొల్లారం మున్సిపాలిటీలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. పనులు పూర్తికాకముందే హడావుడి చేసి ప్రారంభోత్సవాలు చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటూ పార్టీ అసలైన నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *