పెట్రోల్, డీజిల్, పెంచిన ధరలకు నిరసన…
పటాన్ చెరు:
బీజేపీ కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా శుక్రవారం పటాన్ చెరు పట్టణంలో పెట్రోల్ బంక్ ఎదురుగా పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా, నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కె.నరసింహా రెడ్డి మాట్లాడుతూ ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు మోడీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పటాన్ చెరు పట్టణంలో పెట్రోల్ బంక్ ఎదురుగా ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ప్రభుత్వంలో 2014 వరకు అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర వంద డాలర్లకు చేరినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పేట్రోల్, డీజిల్ ధరలు 55, 60 రూపాయలకు మించి లేదని అన్నారు.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ బ్యారేల్ ధర 40 డాలర్లకు చేరుకున్నప్పటికీ పెట్రోల్, డీజిల్ ధర 100 రూపాయలు చేరుకోవడం సిగ్గుచేటని అన్నారు. కరోనా సమయంలో దేశంలో మధ్యతరగతి పేదరికంలో ఉన్నవారు కరోనా చికిత్స, ఉపాధి లేక లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లు 41 సార్లు గడిచిన ఐదు నెలల్లో పెంచడంతో వాణిజ్య వాహనాల పైన అధిక భారం పడడంతో రవాణా ఖర్చులు పెరిగి మంచి నూనె కిలో వంద రూపాయల నుండి రెండు వందల రూపాయలకు పెరిగాయి. అలాగే నిత్యవసర వస్తువులు పప్పులు, కూరగాయల రేట్లు కూడా ఆకాశాన్ని అంటాయి. గ్యాస్ ధర రెట్టింపు అయ్యింది. దీని ద్వారా పేదరికంలో ఉన్న వారిని ఇంకా పేదరికంలోకి మోడీ ప్రభుత్వం నెట్టిందని అన్నారు.
కరోనా సమయంలో గతంలో మోడీ ప్రభుత్వము 20 లక్షల కోట్ల రూపాయలు పేదలకు ఇస్తామని చెప్పి ఇరవై రూపాయలు కూడా ఇవ్వలేదని అన్నారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం తక్షణమే పెంచిన పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ నుండి గెలిచిన టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల పైన ఒక్కసారి కూడా మాట్లాడకపోవడం బీజేపీ మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిచక పోవడం అత్యంత విచారకరమని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెరుగుతున్న నిత్యావసర వస్తువులు పెట్రోల్, డీజిల్ ప్రజలకు భారం కాకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, కాంగ్రెస్ నాయకులు యువ రాజ్ మొరే, రతన్ సింగ్, అంజయ్య, మధు, రాములు, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.