నిర్దేశించిన గడువులోగా ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేయండి 

politics Telangana

రెండు పడకల గదుల ఇళ్ల సముదాయాల్లో మౌలిక వసతులు కల్పన

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో నివాసం ఉండకుంటే రద్దు చేయండి

ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా గ్రౌండింగ్ అయిన యూనిట్లను నిర్దేశించిన గడువు లోగా పూర్తి చేసేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పొంది  వాటిని వినియోగించని వారి స్థానంలో అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు.గురువారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పైన వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలలో తొలి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ళను లబ్ధిదారులందరూ నిర్మించుకునేలా నిరంతరం సమీక్ష నిర్వహించాలన్నారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఏర్పడితే  వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన 45 రోజుల గడువులోగా నిర్మాణం పూర్తిచేసేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కోరారు.

గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం పూర్తయి లబ్ధిదారులకు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో నివాస ఉండకుండా ఖాళీగా ఉన్న ఇళ్లను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. వీటితో పాటు నోటరీ పేరుతో లబ్ధిదారులు తమ ఇళ్ళను విక్రయించినట్లు విచారణలో తేలితే వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు. స్థానిక కోట కింద మిగిలిన ఇళ్లను సైతం అర్హులైన లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.అదే విధంగా నియోజకవర్గ పరిధిలో నిర్మాణ దశలో ఉన్న 5500 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రత్యేకతను పూర్తి చేయాలని. గృహ నిర్మాణ శాఖ ఎమ్ డి గౌతమ్ కు ఎమ్మెల్యే జిఎంఆర్ ఫోన్లో విజ్ఞప్తి చేశారు. వీటి నిర్మాణం పూర్తయితే నియోజకవర్గ పరిధిలోని అర్హులైన నిరుపేదలకు ఇళ్లను కేటాయించడం సాధ్యమవుతుందని తెలిపారు.

కొల్లూరు, ఉస్మాన్ నగర్, అమీన్పూర్ , కర్దనూర్, నాగులపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. వ్యాపార సముదాయాలోని దుకాణాలను నోటిఫికేషన్ ద్వారా మాత్రమే కేటాయించాలని సూచించారు. దళారుల ప్రమేయం లేకుండా అర్హులకు మాత్రమే వీటిని అందించాలన్నారు.ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు నరసయ్య, పీడి చలపతిరావు, డిఈ రవీందర్, ఆయా మండలాల తహసిల్దారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *