విజయవంతంగా పూర్తిచేసిన విద్యార్థులకు గుర్తింపు కార్డు, ప్రశంసా పత్రాల ప్రదానం
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో వారం రోజుల పాటు నిర్వహించిన పౌర రక్షణ వాలంటీర్ల శిక్షణా కార్యక్రమం బుధవారం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని వివిధ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖల సహకారంతో, తెలంగాణ అగ్నిమాపక విపత్తు స్పందన అత్యవసర & పౌర రక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.వైమానిక దాడులు, రసాయన సంఘటనలు, అణు ధార్మికత పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల వంటి అత్యవసర పరిస్థితులలో సమర్థవంతంగా స్పందించడానికి అవసరమైన నైపుణ్యాలను ఈ ఆచరణాత్మక శిక్షణ ద్వారా ఇందులో పాల్గొన్న విద్యార్థులకు అందించారు. సహాయక చర్యలు, అగ్నిమాపక పద్ధతులు, ప్రథమ చికిత్స, జన సమూహ నిర్వహణ, సహాయక సామగ్రి పంపిణీలో అనుసరించాల్సిన వ్యూహాలపై వాలంటీర్లు ఆచరణాత్మక శిక్షణ పొందారు.

సంక్షోభ పరిస్థితులలో సువ్యవస్థితమైన, సకాలంలో స్పందించేలా తీర్చిదిద్దడంతో పాటు పోలీసు శాఖ, అగ్నిమాపక సేవలు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) వంటి కీలక అత్యవసర ప్రతిస్పందన సంస్థలతో సమన్వయం చేసుకునేందుకు కూడా విద్యార్థి స్వచ్ఛంద సేవలకు మార్గదర్శనం చేశారు.తక్షణ సహాయం అందించగల శిక్షణ పొందిన కమ్యూనిటీ వాలంటీర్ల బలమైన నెట్ వర్కును నిర్మించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని, తద్వారా అత్యవసర పరిస్థితులలో ప్రాణాలను కాపాడటానికి, నష్టాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని శిక్షణను పర్యవేక్షించిన ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

ఈ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన గీతం విద్యార్థి స్వచ్ఛంద సేవకులకు, జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా విలువైన గుర్తింపు కార్డు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ విశిష్టమైన, ప్రభావవంతమైన శిక్షణా కార్యక్రమంలో భాగమైనందుకు గీతం విద్యార్థులు ఒకింత గర్వాన్ని, సంతృప్తిని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమాన్ని మార్చి 12న గీతం హైదరాబాదు రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, సంగారెడ్డి జిల్లా అగ్నిమాపక శాఖాధికారి బి.నాగేశ్వరరావు, పటాన్ చెరు అగ్నిమాపక శాఖాధికారి కె.వి. నాగేంద్ర, ఇతర అధికారుల, సిబ్బంది సమక్షంలో లాంఛనంగా ప్రారంభించిన విషయం విదితమే.
