యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు, విద్యార్థులు మరియు పారిశ్రామిక కార్మికుల రవాణా కష్టాలను తీర్చడానికి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు. గతంలో బి.హెచ్.ఈ.ఎల్ బస్ డిపో నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న సిటీ మరియు రూరల్ సర్వీసులను హెచ్.సి.యు డిపోలో విలీనం చేయడం వల్ల స్థానిక రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సికింద్రాబాద్ రీజియన్లో ఉన్న బి.హెచ్.ఈ.ఎల్ డిపోను జిల్లా డిపోగా మారుస్తూ రంగారెడ్డి రీజియన్లో కలపడం వల్ల స్థానిక ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతం బస్సులు హెచ్.సి.యు మరియు కూకట్పల్లి వంటి దూర ప్రాంత డిపోల నుండి పటాన్చెరు బస్ స్టేషన్కు రావాల్సి వస్తోంది. తీవ్రమైన ట్రాఫిక్ జామ్ మరియు ఇతర సాంకేతిక కారణాల వల్ల బస్సులు సకాలంలో రాకపోవడంతో శంకర్ పల్లి, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, బొంతపల్లి కమాన్ వంటి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాల్సిన విద్యార్థులు, సామాన్య ప్రజలు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.
ఇది అటు సంస్థకు ఇంధనం వృథా కావడంతో పాటు ఆర్థిక భారంగా మారుతోంది, ఇటు ప్రజలకు అమూల్యమైన సమయం వృథా అవుతోంది.తెలంగాణ ప్రభుత్వం కాలుష్య రహిత ప్రయాణం కోసం 2,000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 14 కొత్త ఆర్టీసీ డిపోలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో పటాన్చెరు నియోజకవర్గ ప్రాధాన్యతను గుర్తించి, ఇక్కడ ప్రత్యేక ఎలక్ట్రిక్ బస్ డిపోను మరియు ఛార్జింగ్ స్టేషన్ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. పారిశ్రామిక కేంద్రమైన పటాన్చెరును ‘ఫోర్త్ సిటీ’ తరహాలో అభివృద్ధి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం, రవాణా రంగంపై ప్రత్యేక దృష్టి సారించి బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే, నియోజకవర్గ ప్రజలు మరియు విద్యార్థుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మెట్టు శ్రీధర్ హెచ్చరించారు.
