తిరుపతి
తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద నిర్మించిన శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిర సముదాయాన్ని సోమవారం ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ముందుగా అలిపిరి పాదాల మండపం వద్దకు చేరుకున్న గౌ|| ముఖ్యమంత్రికి టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈవో శ్రీమతి సదా భార్గవి కలిసి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.
తిరుమల తిరుపతి దేవస్థానములు గోసంరక్షణకు పెద్దపీట వేస్తూ గోవిందుని, గోవు విశిష్టతను తెలియజేస్తూ భక్తులు ముందుగా సకలదేవతా స్వరూపిణిగా భావిస్తున్న గోమాతను దర్శించుకుని, తరువాత శ్రీవారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో అలిపిరి శ్రీవారి పాదాల చెంత చెన్నైకి చెందిన దాత అందించిన రూ.15 కోట్ల విరాళంతో శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిర సముదాయాన్ని టిటిడి నిర్మించింది. తిరుమలకు నడకదారిలోనూ, వాహనాల్లోనూ వెళ్లే భక్తులకు అనువుగా ఉండే చోట ఈ మందిరం నిర్మించడం జరిగింది.
ప్రాముఖ్యతలు
ఏడు కొండలకు సూచికగా ఏడు గోవులు, వాటి దూడల నడుమ శ్రీవేణుగోపాలస్వామి విగ్రహం, గోదర్శనం, గోపూజ, ప్రత్యేకంగా గ్రహశాంతి నివారణ పూజలు నిర్వహించుకునేందుకు వీలుగా శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిరం ఏర్పాటు చేయడమైనది. భక్తులు వారు ఎంపిక చేసుకున్న గోవు బరువును బట్టి ద్రవ్యములు గానీ, గ్రాసం గానీ తులాభారం ద్వారా దానంగా సమర్పించే అవకాశం కల్పించడం జరిగింది. కనుమరుగవుతున్న భారతీయ స్వదేశీ గోజాతులు, వాటి ఔన్నత్యాన్ని దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా తెలియజేసే విధంగా గోవిజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేశారు. పూజకు సంబంధించిన వివిధ జాతుల గోవులను గోసదన్లో ఉంచి వాటి ఆలనాపాలనా చూసేందుకు వీలుగా గోసదన్ నిర్మించారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి, ఉపసభాపతి శ్రీ కోన రఘుపతి, మంత్రులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు, శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి, ఎంపీలు శ్రీ గురుమూర్తి, శ్రీ మిథున్ రెడ్డి, శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే శ్రీ కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, అదనపు ఈఓ ఏవి.ధర్మారెడ్డి, జె ఈ ఓ శ్రీమతి సదా భార్గవి, తిరుపతి కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ శ్రీ భూమన అభినయ రెడ్డి, దాత శ్రీ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.