_తెలంగాణ రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ నిరసనలు
_ఇస్నాపూర్ నిరసనలో పాల్గొననున్న ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణ రైతన్నకి 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దు అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ప్రకటనను నిరసిస్తూ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నేడు పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటన తెలంగాణ రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరినీ అద్దం పడుతోందని విమర్శించారు. ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్ పార్టీదన్నారు. గతంలో కూడా విద్యుత్ ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలదని విమర్శించారు.పటాన్చెరు మండలం ఇస్నాపూర్ చౌరస్తాలో నిర్వహించబోయే నిరసన కార్యక్రమంలో తన స్వయంగా పాల్గొననున్నట్లు తెలిపారు.నియోజకవర్గ పరిధిలోని అన్ని మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు, జిహెచ్ఎంసి డివిజన్ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలు దహనం చేసి, ఆ పార్టీ వైఖరిని ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు.నియోజకవర్గ పరిధిలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.