కృత్రిమ మేధస్సుతో కలుపుతీసే యంత్రం

Telangana

స్వయంప్రతిపత్తి రోబోట్ ను ఆవిష్కరించిన

గీతం బీటెక్ చివరి ఏడాది విద్యార్థిని అమూల్య

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఆధునిక వ్యవసాయాన్ని విప్లవాత్మకంగా మార్చడానికి రూపొందించిన కృత్రిమ మేధస్సు (ఏఐ)తో కూడిన స్వయంప్రతిపత్తి కలుపు తీసే రోబోట్ ను గీతం బీటెక్ చివరి ఏడాది విద్యార్థి సి.అమూల్య, ఆమె బృంద సభ్యులు అభివృద్ధి చేశారు. స్మార్ట్ ఫార్మింగ్ కోసం ఏఐ-శక్తితో కూడిన స్వయంప్రతిపత్తి కలుపు తీసే రోబోట్ అనే వారి క్యాప్ స్టోన్ (ముగింపు) ప్రాజెక్టులో భాగంగా, ఈ బృందం పంటలకు హాని కలిగించకుండా కలుపు మొక్కలను గుర్తించి తొలగించగల రోబోటిక్ పరిష్కారాన్ని రూపొందించింది. ఈ అత్యాధునిక వ్యవస్థ హానికరమైన కలుపు మందులపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా మానవీయ శ్రమను గణనీయంగా తగ్గించి, పర్యావరణ స్పృహతో కూడిన వ్యవసాయ పద్ధతులను సూచిస్తోంది.టెన్సార్ ఫ్లో లైట్ ద్వారా అమలుచేసి, రాస్ బెర్రీ పై4లో అనుసంధానించిన తేలికైన సీఎన్ఎన్ మోడల్ ను ఉపయోగించి కలుపు మొక్కలను గుర్తించి తొలగించే స్వయంప్రతిపత్తి రోబోట్ ను తమ బృందం అభివృద్ధి చేసినట్టు అమూల్య వివరించారు. జీపీఐవో ద్వారా వాస్తవ-సమయ ప్లాంట్ వర్గీకరణ, మోటార్ నియంత్రణను తమ వ్యవస్థ నిర్వహిస్తుందన్నారు.

వ్యవసాయాన్ని మరింత స్థిరంగా, అందుబాటులోకి తీసుకురావడమే తమ అంతిమ లక్ష్యమని అమూల్య స్పష్టీకరించారు. ఈ ప్రాజెక్టును మరింత మెరుగుపరస్తూ, జీపీఎస్ సాయంతో, సౌరశక్తితో పనిచేసేలా, మరిన్ని పంట రకాలు, ప్రాంతీయ వైవిధ్యాలకు మద్దతు ఇవ్వడానికి డేటాసెట్ విస్తరణ చేపట్టాన్నారు.ఈ వ్యవసాయ ఆవిష్కరణతో పాటు, మరొక అధిక ప్రభావ ప్రాజెక్టును కూడా పూర్తిచేసినట్టు అమూల్య వెల్లడించారు. ఈ ప్రాజెక్టు వివిధ ఎలక్ట్రానిక్ సిస్టమ్ లకు అవసరమైన వరుస ఉజ్జాయింపు రిజిస్టర్ (ఎస్ఏఆర్) అనలాగ్-టు-డిజిటల్ కన్వర్టర్ లలో సిగ్నల్ విశ్వసనీయతను మెరుగుపరచడంపై దృష్టి సారించినట్టు అమూల్య తెలిపారు.

ఈ ప్రాజెక్టుకు మార్గదర్శనం చేసిన ఈఈసీఈ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సీహెచ్. ప్రవీణ్ కుమార్, తన బృంద సభ్యులు కె.మణికంఠ, శివ ధనుష్ ముసునూరిలకు ఆమె హృదయపూర్వక కృతజ్జతలు తెలియజేశారు. ఈ ప్రాజెక్టులు కృత్రిమ మేధస్సు, ఎంబెడెడ్ సిస్టమ్, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ వంటి వాటిపై అవగాహనను మరింతగా పెంచుకోవడానికి తమకు అవకాశం కల్పించాయన్నారు.అమూల్య, ఆమె బృందం సాధించిన విజయాలను గీతం నాయకత్వం- హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్. శాస్త్రి, అసోసియేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్. సీతారామయ్య, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి.మాధవి తదితరులు విద్యార్థుల ఆవిష్కరణ, శ్రేష్ఠతలను ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *