76వ ఎన్ సీసీ దినోత్సవంలో గీతం ప్రోవీసీ ప్రొఫెసర్ డీ ఎస్ రావు ఉద్బోధ
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
క్రమశిక్షణతో కూడిన దేశంలో మనం ఏ మైలురాయినైనా అధిగమించగలమని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు ఉద్బోధించారు. జాతీయ క్యాడెట్ కార్ప్స్ (ఎన్ సీసీ) 76వ వ్యవస్థాపక దినోత్సవాన్ని మంగళవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్ రావు మాట్లాడుతూ, ఎన్ సీసీ నినాదమైన ఐక్యత, క్రమశిక్షణతో క్యాడెట్లు ప్రతి అంశంలో రాణించగలుగుతారని, ఎందుకంటే వారు క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం వంటి లక్షణాలను కలిగి ఉంటారన్నారు. ఈ క్రమశిక్షణ వారి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి బలం, ధైర్యం, ఓర్పును అందిస్తాయని చెప్పారు.మనదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు కృషి చేస్తున్నందున, తక్కువ తలసరి ఆదాయం సవాలు పరిష్కరించే దిశగా ఎన్ సీసీ క్యాడెట్లు తాము సమకూర్చుకున్న జ్జానంతో కృషిచేయాలని, పౌరుల జీవన ప్రమాణాలను పెంపొందించాలని ప్రొఫెసర్ రావు పిలుపునిచ్చారు. ఎన్ సీసీ క్యాడెట్ గా తన అనుభవాలు, క్యాంపు, అక్కడి భోజన వసతి సౌకర్యాలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు.
తొలుత, ఈ వేడుకలు ఎన్ సీసీ జెండా వందనంతో పాటు క్యాడెట్ల ఖచ్చితత్వం, క్రమశిక్షణ, అంకితభావాన్ని ప్రదర్శించే కవాతుతో ప్రారంభమయ్యాయి. దీని తర్వాత పర్యావరణ ప్రాముఖ్యతను చాటిచెప్పేలా కొన్ని మొక్కలను నాటారు. ఈ ఉత్సవాలలో ఆధునిక సృజనాత్మకతతో గొప్ప సంప్రదాయాలను మిళితం చేసి ప్రేక్షకులను కట్టిపడేసే ఉత్సాహభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉన్నాయి.నేపాల్లో జరిగిన ఎన్ సీసీ యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ (వైఎల్ పీ)లో పాల్గొన్న గీతం విద్యార్థిని, క్యాడెట్ అండర్ ఆఫీసర్ మహిత కొండూరిని ప్రొఫెసర్ రావు సత్కరించి. ఒక కోటు, మొక్కను అందజేశారు.
ఆమె, తన ప్రతిస్పందనలో నేపాల్ కు తన ప్రయాణం, అక్కడ రోజువారీ నిర్వహించిన సాహసోపేతమైన కార్యక్రమాలను వివరించడంతో పాటు, ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ కృతజ్జతలు తెలియజేశారు.ఎన్ సీసీ క్యాడెట్ ప్రధాన లక్షణాలను జూనియర్ అండర్ ఆఫీసర్ అబ్దుల్ హదీ షరీఖ్ వివరించగా, క్యాడెట్ సంహిత వందన సమర్పణ చేశారు.ఈ వేడుకలలో గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్పోర్ట్స్ డిప్యూటీ డైరెక్టర్ ఎం.నారాయణరావు చౌదరి, ఎన్ సీసీ కేర్ టేకర్ ఆఫీసర్ ఎస్.అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.