పటాన్చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ సింఘా రూపొందించిన డిజైన్ పేటెంట్ ప్రముఖ ఇండియన్ పేటెంట్ జర్నల్ లో ప్రచురితమైంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని పేటెంట్లు, డిజెన్లు, ట్రేడ్మార్క్ ల కంట్రోలర్ జనరల్ దీనిని ఆమోదించినట్టు శనివారం వెల్లడించారు. డాక్టర్ సుధాకర్ ను గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఇంజనీరింగ్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఏకే మిట్టల్, అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య, పలువురు విభాగాధిపతులు, అధ్యాపకులు తదితరులు అభినందించినట్టు పేర్కొన్నారు.
విజయవంతంగా ముగిసిన జాతీయ సదస్సు
గీతం, హైదరాబాద్ లోని సీఎస్ఈ విభాగం అధ్వర్యంలో ‘కంప్యూటింగ్ – డేటా సైన్సెస్ లో ఇటీవలి ఆవిష్కరణలు’ అనే అంశంపై ఈనెల 12-13 తేదీలలో నిర్వహించిన ఆన్లైన్ జాతీయ సదస్సు విజయవంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా, వివిధ రాష్ట్రాల నుంచి సదస్యులు కంప్యూటర్ సైన్స్ లో ఇటీవలి ఆవిష్కరణలపై పత్ర సమర్పణ చేయగా, అందులో ఎంపిక చేసిన వాటిని ప్రచురించినట్టు సీఎస్ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్.ఫణికుమార్ వివరించారు. ఐఐటీ మద్రాసుకు చెందిన ప్రొఫెసర్ సి.చంద్రశేఖర్, ఎన్ఐటీ సూరత్ కల్ కు చెందిన ప్రొఫెసర్ అన్నప్ప తదితరులు ఈ సదస్సులో కీలకోపన్యాసం చేసినట్టు తెలియజేశారు.