కల్తీ టీపొడి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టు

Andhra Pradesh Crime

మనవార్తలు ,విజయవాడ:

పదేళ్లుగా కల్తీ టీపొడి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టయింది. సూర్యాపేటతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం, విజయవాడ ప్రాంతాల్లో మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించి రూ.22.5లక్షల విలువైన 45.5 క్వింటాళ్ల కల్తీ టీపొడి, 50 కిలోల ప్రమాదకర రసాయన రంగు పొడిని స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేటకు చెందిన 10 మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 8 మంది పరారీలో ఉన్నారు.

సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం సూర్యాపేటలో కల్తీ టీపొడి విక్రయిస్తున్నట్లు సమాచారం తెలియడంతో సోమవారం పోలీసులు 3 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించారు. తొలుత రాచకొండ అనిల్‌, పోకల రమేశ్‌, బూర్ల వినయ్‌కుమార్‌, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన సర్వేమ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని వారివద్ద ప్రాణాంతకమైన కల్తీ టీపొడిని గుర్తించారు. వారిచ్చిన సమాచారం మేరకు

రాజమహేంద్రవరంలోని కృష్ణచైతన్య ఇంట్లో 12 క్వింటాళ్ల కల్తీ టీపొడి, రసాయన రంగుపొడి, ఇతర తయారీ సామగ్రి, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఇదేనగరంలోని జగన్నాథం వెంకట్‌రెడ్డి వద్ద 23 క్వింటాళ్ల టీపొడి, రసాయన రంగుపొడి, కారును పట్టుకున్నారు. విజయవాడలోని కామేశ్వరరావు ఇంట్లో 9.30 క్వింటాళ్ల కల్తీ టీపొడి, రంగుపొడి కనుగొన్నారు. సూర్యాపేటలోని టి.రాము, తోట వెంకటేశ్వర్లు, రాజు, సంతోష్‌, రాజేష్‌, రమేశ్‌, సంపత్‌, లక్ష్మయ్య, వినయ్‌ల నుంచి మొత్తం 129 కిలోల కల్తీ టీపొడిని స్వాధీనపరచుకొని నిందితులను అరెస్టు చేశారు. కల్తీ టీపొడిని కలిపిన వెంటనే నీరు ముదురు ఎరుపు రంగులోకి మారిపోతుందని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ చెప్పారు. ఈముఠాను పట్టుకున్న సిబ్బందికి నగదు పురస్కారాన్ని అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *