_అంబేద్కర్ కు ఘన నివాళి
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు , పటాన్ చెరు:
భారత రాజ్యాంగ నిర్మాత, అభ్యుదయవాది, అంటరానితనం నిర్మూలన కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని, ఆయన ఆలోచనా విధానం నేటి తరానికి అనుసరణీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131 వ జయంతిని పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో అంబేద్కర్ విగ్రహాలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానానికి అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.
స్వాతంత్రం అనంతరం దేశంలో అత్యధిక శాతం కలిగిన బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులను పొందుపరిచిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ఆరాధ్య దైవంగా అంబేద్కర్ మారారని అన్నారు. అంబేద్కర్ అంటే ఒక వర్గానికి పరిమితం కాదని, అన్ని వర్గాలకు స్ఫూర్తి ప్రదాత అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ముఖ్యమంత్రి కెసిఆర్ దళిత బంధు పథకం ప్రవేశ పెట్టారని అన్నారు. దళిత సామాజిక వర్గంలో ఈ పథకం పెను విప్లవం తీసుకొని రాబోతుందని అన్నారు.