బల్దియా పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగుపరచండి
బల్దియా కమిషనర్ కు ఎమ్మెల్యే జిఎంఆర్ వినతి
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లలో లబ్ధిదారులకు కేటాయించని ఇళ్లను స్థానికులకు కేటాయించాలని, మూడు డివిజన్లో పరిధిలో పారిశుద్ధ వ్యవస్థ మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ జిహెచ్ఎంసి కమిషనర్ ఇలంబరితి కి స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. శుక్రవారం హైదరాబాద్ లోని బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ తో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా.. పారిశ్రామికవాడగా పేరొందిన పటాన్చెరు పరిధిలో నిరుపేదలు అత్యధికంగా నివసిస్తున్నారని.. సొంత ఇల్లు లేక కిరాయిలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలలో నిర్మించిన 40 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఖాళీగా ఉన్న ఇళ్లను స్థానికులకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో కొద్దిమంది లబ్ధిదారులకు మాత్రమే ఇళ్లను కేటాయించడం జరిగిందని, అర్హత కలిగిన లబ్ధిదారులు వేల సంఖ్యలో ఉన్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.
భారతి నగర్, రామచంద్రాపురం, పటాన్చెరు డివిజన్ల పరిధిలో పారిశుద్ధ్య కార్మికుల కొరత మూలంగా శానిటేషన్ పూర్తి స్థాయిలో జరగడం లేదని తెలిపారు. చనిపోయిన కార్మికుల స్థానాల్లో నూతన కార్మికులను నియమించాలని, అర్హత లేకున్నా సూపర్వైజర్లు గా వ్యవహరిస్తున్న కార్మికులపై చర్యలు తీసుకోవాలని, సర్కిల్ పరిధిలో నూతన జెసిబిని ఏర్పాటు చేయాలని కోరారు. పేద ప్రజల అవసరాల కోసం నిర్మించిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ అధ్వానంగా తయారయిందని తెలిపారు. రహదారులపై నిర్మించిన టాయిలెట్ల నిర్వహణ గాలికి వదిలేసారని పేర్కొన్నారు. వీటన్నింటిపై క్షేత్రస్థాయిలో పర్యటించి తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు.