పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
నిర్మాణాల పునరుద్ధరణ , మరమ్మతులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినట్టు గీతం పూర్వ విద్యార్థి , హిల్టీ ఇండియా స్పెసిఫికేషన్ కన్సల్టెంట్ త్రివేద్ నౌదురి చెప్పారు . గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ నిర్మాణాల పునరుద్ధరణకు రూపకల్పన పరిష్కారాలు ‘ అనే అంశంపై బుధవారం నిర్వహించిన ఒకరోజు వర్క్షాప్లో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు . గీతం ఆవిష్కరణల మండలి ( ఐఐసీ ) సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యశాలలో ఆయన మాట్లాడుతూ , నిర్మాణాల మరమ్మత్తు , పునరావాసంలో ముందుగానే ఏర్పాటుచేసిన యాంకరింగ్ క్రియాశీల భూమిక పోషిస్తుందని చెప్పారు . ఎందుకంటే , అప్పటికే ఉన్న నిర్మాణాలను అనుసంధానించడానికి , కొత్త విభాగాల ఏర్పాటుకు యాంకరింగ్ తోడ్పడుతుందన్నారు .
స్ట్రక్చరల్ రీబార్ యాంకరింగ్ అంటే- అప్పటికే ఉన్న కాంక్రీటు నిర్మాణంలో రంధ్రాలు చేయడం , వాటిలోకి ఇనుప రాడ్లను చొప్పించడం , రసాయనాలను పంపించడమని త్రివేద్ వివరించారు . ఈ విధానంలో ప్రధాన నిర్మాణాన్ని మార్చకుండా , ప్రస్తుత అవసరాల మేరకు ఆయా సౌకర్యాలను పునరుద్ధరించవచ్చన్నారు . యాంకర్ ఆధార పలకను కాంక్రీటుకు అనుసంధానం చేయడానికి అవసరమైన యాంకర్ల సంఖ్య , చుట్టుకొలత , చొప్పించాల్సిన లోతులను లెక్కించగల అంతర్జాతీయ హిల్టీ ప్రొఫెస్ట్ సాఫ్ట్వేర్ను ఆయన గీతం విద్యార్థులకు పరిచయం చేశారు . త్రివేద్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యశాలలో హిల్టీ ఇండియా సాంకేతిక విభాగాధిపతి ముఖేష్ ఆలూరు , కన్సల్టెంట్ సల్మాన్ కూడా పాల్గొన్నారు . విద్యార్థులు లేవనెత్తిన పలు సందేహాలను వారు నివృత్తిచేశారు . తొలుత , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య అతిథిని సత్కరించారు . గీతం పూర్వ విద్యార్థుల సమన్వయకర్త డాక్టర్ పి.త్రినాథరావు స్వాగతోపన్యాసం చేయగా , కార్యశాల నిర్వాహకురాలు డాక్టర్ జి.జ్యోతికుమారి వందన సమర్పణ చేశారు .