మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఆదుర్తి శ్రీవల్లి డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘మైక్రోఫ్లూయిడ్ అప్లికేషన్ల కోసం మైక్రోఛానల్ లో విద్యుదయస్కాంత ప్రవాహం యొక్క గణిత నమూనా, విశ్లేషణ’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గణిత శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మోతాహర్ రెజా శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పరిశోధన మైక్రోఛానళ్లలో సంక్లిష్ట ద్రవాల యొక్క విద్యుదయస్కాంత హైడ్రోడైనమిక్ ప్రవాహాలపై సైద్ధాంతిక అంతర్దృష్టులను అందిస్తుందని తెలిపారు. ల్యాబ్-ఆన్-చిప్ సిస్టమ్ లు, లక్ష్య ఔషధ పంపిణీ వంటి అధునాతన మైక్రోఫ్లూయిడ్ వినియోగానికి ఇది వీలు కల్పిస్తుందన్నారు.డాక్టర్ శ్రీవల్లి సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రెజా, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందనలు తెలియజేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
