_గల్లి గల్లి లో బోనాల పండుగ వాతావరణం..
_భారీ సంఖ్యలో కళారూపాలు.. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..
_అమ్మవారి కరుణాకటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి..
మనవార్తలు ,పటాన్ చెరు:
పటాన్ చెరులో ఆషాడమాసం బోనాల సంబురాలు అంబరాన్నంటాయి. పట్టణంలోని ప్రతి అమ్మవారి ఆలయం భక్తులతో కిటికీటలాడింది.పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఫలహార బండి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. వందలాది మంది కళాకారులు, పోతురాజులు, శివ సత్తుల పూనకాలతో ప్రజలందరూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.ఆషాడ మాస బోనాల పండుగ సందర్భంగా పటాన్ చెరు పట్టణంలోని వివిధ కాలనీలో గల అమ్మవారి దేవాలయాలను ఎమ్మెల్యే జిఎంఆర్ దర్శించుకున్నారు.
బోనం సమర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్ కుటుంబ సభ్యులు
బోనాల పండుగను పురస్కరించుకొని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి యాదమ్మ, వారి కుటుంబ సభ్యులు ఏడుగుల్ల పోచమ్మ దేవాలయంలో బోనం సమర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ అమ్మవారి కరుణాకటాక్షాలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పట్టణ పుర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.