27 సంవత్సరాలుగా ప్రతి ఏటా ఇఫ్తార్ విందు
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకుని వచ్చే నెల మార్చి 13వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గ స్థాయి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని ముస్లిం మత పెద్దలు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఇఫ్తార్ విందు ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ మతపెద్దల సూచనలకు అనుగుణంగా మార్చి 13వ తేదీన ఇఫ్తార్ విందు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ముస్లిం సోదర సోదరీమణులందరూ భారీ సంఖ్యలో విందుకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. గత 27వ సంవత్సరాలుగా రంజాన్ పురస్కరించుకొని ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ముస్లింలకు తగు ప్రాధాన్యత అందించడంతోపాటు సొంత నిధులతో మసీదులు, ఆశిర్ఖానాలు నిర్మించి వారి ఆర్థిక అభ్యున్నతికి పాటుపాడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ముస్లిం మత పెద్దలు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
