మిస్ తెలుగు యూఎస్ఏ రన్నరప్ కిరీటం, పీపుల్స్ ఛాయిస్ అవార్డులు కైవసం
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిని చూర్ణికా ప్రియ కొత్తపల్లి మిస్ తెలుగు యూఎస్ఏ 2025 పోటీలో రెండు ప్రతిష్టాత్మక టైటిళ్లను సాధించినట్టు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో జన్మించిన చూర్ణిక, ప్రస్తుతం అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చదువుతున్నారని, గీతంలో బీటెక్ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్-2024) పట్టభద్రురాలని తెలిపారు. మిస్ తెలుగు యూఎస్ఏ 2025 పోటీలో ఆమె మొదటి రన్నరప్ కిరీటాన్ని గెలుచుకోవడమే గాక, దాదాపు 7,200 పైగా ప్రజా ఓట్లను సంపాదించి, సమీప పోటీదారు కంటే 1,300 మెజారిటీతో గౌరవనీయమైన పీపుల్స్ ఛాయిస్ అవార్డును కూడా అందుకున్నట్టు తెలియజేశారు.
ఈ పోటీలలో తనకు మద్దతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా చూర్ణిక కృతజ్జతలు తెలియజేస్తూ, ఈ విజయం తనొక్కరిదే కాదని, ఇది తనను నమ్మిన, తనకు ఓటు వేసిన, ప్రతి అడుగులో తనను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ చెందుతుందన్నారు. వారి మద్దతు పెద్ద కలలు కనడానికి బలాన్నిచ్చిందని అభిప్రాయపడ్డారు.సాంకేతిక విద్యతో పాటు 14 ఏళ్లగా భరత నాట్య కళాకారిణిగా ఆమె శాస్త్రీయంగా శిక్షణ పొందుతోందని, ఈ కళాత్మక ప్రయాణం ఆమెకు క్రమశిక్షణ, సృజనాత్మకత, స్థితిస్థాపకతను ఇచ్చిందన్నారు.బలమైన విద్యా పునాది, కళల పట్ల లోతైన నిబద్ధత, అంతర్జాతీయ వేదికలపై పెరుగుతున్న గుర్తింపుతో, చూర్ణిక, గీతం యొక్క స్ఫూర్తిని ఉదాహరణగా చూపిస్తోందని తెలిపారు. శ్రేష్ఠత, ఆశయం, సమాజ సేవ, శాశ్వత ప్రభావాన్ని చూపాలనే సంకల్పంతో, ఆమె కొత్త మార్గాలను అన్వేషిస్తూ, ప్రపంచ సంబంధాలను నిర్మిస్తూ, స్ఫూర్తిని కొనసాగిస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.