గీతంలో భారత సాహిత్య సంస్కృతులపై చర్చాగోష్ఠి

Telangana

దేశ నలుమూలల నుంచి తరలి వచ్చిన ప్రసిద్ధ ప్రొఫెసర్లు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లోని ఆంగ్లం, ఇతర భాషల విభాగం ఆధ్వర్యంలో ‘పరివర్తన దశ: భారతదేశంలో సాహిత్య సంస్కృతులు, సామాజిక-రాజకీయ ఉద్యమాలు’ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల చర్చాగోష్ఠిని గురువారం లాంఛనంగా ప్రారంభించారు. భారతీయ సందర్భంలో సాహిత్యం, భావజాలం, సంస్కృతి, సామాజిక పరివర్తనపై విమర్శనాత్మక చర్చల కోసం ప్రముఖ పండితులు, విద్యావేత్తలను ఈ సింపోజియం ఒకచోట చేర్చింది.వలసవాద, ప్రారంభ ఆధునిక భారతదేశంలో సాహిత్యం, భావజాలం, సామాజిక ప్రతిఘటన’ అనే అంశంపై అమృత్ సర్ లోని గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం, ఎస్.ఆర్. ప్రభుత్వ మహిళా కళాశాలకు చెందిన డాక్టర్ అమన్ దీప్ కౌర్, డాక్టర్ జగ్వీర్ సింగ్ లతో పాటు గీతం అధ్యాపకుడు డాక్టర్ జోంధలే రాహుల్ హిరామన్ ఉపన్యసించారు.

‘కులాన్ని పున:నిర్వచించడం: 1872 నాటి ఒక తెలుగు నవల’ అనే అంశంపై హైదరాబాదు విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ అల్లాడి ఉమ, ప్రొఫెసర్ ఎం.శ్రీధర్ కీలకోపన్యాసాలు చేశారు. ఒక నవల ఒకే సమయంలో కల్పితంగా, చారిత్రకంగా ఎలా ఉండగలదో ప్రొఫెసర్ శ్రీధర్ వివరించారు. శతాబ్దాలుగా ప్రబలంగా ఉన్న కుల వ్యవస్థను అది చిత్రించడంలో దాని చారిత్రకత ఉందని, అయితే శ్రీరంగరాజు అనే విజయనగర రాజు లేకపోవడంలో దాని కల్పిత అంశం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. సోనాబాయి ఒక లంబాడా అమ్మాయి నుంచి నాయక కుటుంబ సభ్యురాలిగా మారడం కూడా వాస్తవికతను కల్పితంగా పునర్నిర్మించడాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. ఈ కథ ఎంపిక సూచించేదేమంటే, ఆమె లంబాడా మహిళగానే ఉండి ఉంటే, ఆనాటి కుల వివక్షతో నిండిన సమాజం ఈ నవలను అంగీకరించి ఉండేది కాదని, అయితే, అంటరాని కులాల పట్ల నవలా రచయిత వైఖరిని విమర్శించవచ్చన్నారు. ఈ విధంగా ప్రొఫెసర్ శ్రీధర్ సాహిత్యంలో ఆధునికత గురించి కీలకమైన ప్రశ్నలను లేవనెత్తి, హిందూ సమాజ వ్యవస్థకు కేంద్రంగా ఉన్న కులం, గిరిజన దృక్కోణాల ద్వారా శ్రీరంగనాథ చరితము వంటి గ్రంథాలను పున:పరిశీలించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

‘వలసవాద స్థానిక సంస్కృతులలో లింగం, లైంగికత, నైతిక ఆందోళన’ అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో సంబల్ పూర్ లోని గంగాధర్ మెహర్ విశ్వవిద్యాలయ ఆచార్యుడు డాక్టర్ పి.మురళీధర్ శర్మ, వెల్లూరు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి అధ్యాపకురాలు డాక్టర్ మీను బి., గీతం ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ సయంతన్ మండల్ ఆలోచింపజేసే ప్రసంగాలను అందించారు. వక్తలు లింగం, నైతికత, స్థానిక సాహిత్య సంప్రదాయాల మధ్య ఉన్న సంబంధాలను విశ్లేషించారు. జీఎస్ హెచ్ఎస్ ఇన్ ఛార్జి డైరెక్టర్ డాక్టర్ శామ్యూల్ తరు, ప్రొఫెసర్ డీ.ఆర్.పీ.చంద్రశేఖర్, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు కూడా ఈ సింపోజియంలో పాల్గొన్నారు.

‘భక్తి, అంతర్గతత్వం, ఆధునిక భారతదేశంలో నైతిక-రాజకీయ కర్తలను రూపొందించడం’ అనే కార్యక్రమంలో రెండో రోజు సింపోజియం ఆరంభం కానుంది. దేవ్ గఢ్ కళాశాలకు చెందిన డాక్టర్ శిఖా మహర్షి, రావెన్ షా విశ్వవిద్యాలయ ఆచార్యులు ఉర్మిశ్రీ బెడమట్ట, గీతం అధ్యాపకుడు డాక్టర్ అభిలాష్ ఉపన్యసించనున్నారు. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ ఆచార్యుడు ప్రొఫెసర్ ఉదయ కుమార్ ‘సామాజికత యొక్క సాహిత్యం, భాషలు: కేరళ నుంచి కొన్ని గమనికలు’ అనే అంశంపై కీలకోపన్యాసం చేస్తారు.

ఈ రెండు రోజుల సింపోజియం ‘పరివర్తన దశలోని విషయాలు, పరివర్తనాత్మక గ్రంథాలు, ఆధునికత’ అనే కార్యక్రమంతో ముగియనుంది. ఇందులో ముంబై లోని ఎస్ఎన్ డీటీ మహిళా విశ్వవిద్యాలయ ఆచార్యులు డాక్టర్ ధ్రుపది చటోపాధ్యాయ, షిల్లాంగ్ లోని ఈశాన్య హిల్ యూనివర్సిటీ ఆచార్యులు డాక్టర్ సోమజ్యోతి మృధా, గీతం-విశాఖ అధ్యాపకుడు ఫుజైల్ అసర్ సిద్దిఖీ ప్రసంగించనున్నారు. ఈ చర్చలు భారతీయ సామాజిక-సాంస్కృతిక సందర్భాలలో సాహిత్య ఆధునికత యొక్క పరిణామ స్వభావాన్ని, పరివర్తన చెందుతున్న విధానాన్ని ప్రస్ఫుటీకరిస్తాయి.మనదేశంలోని సాహిత్య సంస్కృతులు, సామాజిక-రాజకీయ ఉద్యమాలతో విమర్శనాత్మక సంబంధాన్ని పెంపొందిస్తూ, అంతర్-విభాగ సంభాషణకు ఒక శక్తివంతమైన వేదికను ఈ సింపోజియం అందజేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *