మనవార్తలు ,పటాన్ చెరు;
ప్రభుత్వ పాఠశాలలో మౌళిక సదుపాయాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని ముత్తంగి ప్రభుత్వ పాఠశాలను బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ పరిశీలించారు. విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వకుండానే పాఠాలు చెబుతున్నారని పేరుకే మన మన ఊరు, మన బడి కార్యక్రమం అంటూ ప్రభుత్వం గొప్పలు చెబుతుందని విమర్శించారు. పాలకుల మాటలకు క్షేత్ర స్థాయిలో పనులకు పొంతన లేదని గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .జిల్లాలోని గ్రామీణ పాఠశాల భవనాలు శిధిలావస్థలో ఉన్నాయని గోడలు , పైకప్పులు కూలేస్థితిలో ఉన్నాయనే విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. పాఠశాలలో కనీసం తాగునీరు అందడంలేదన్నారు .సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ లను తరగతి గదులుగా వినియోగిస్తున్నారని తెలిపారు.

మన ఊరు మన బడి పేరుతో కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి పాఠశాలల రూపు రేఖలు మారుస్తాం అన్న ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం అయిందని శ్రీకాంత్ గౌడ్ ఎద్దేవా చేసారు. పాఠశాల గోడలు శిధిలావస్థలో ఉన్నాయని, కనీసం మరుగుదొడ్లు కుడా సక్రమంగా లేకపోవడం, త్రాగు నీరు లేకపోవడం చాలా బాధాకరం అన్నారు. పాఠశాలలు ప్రారంభం అయి మూడు వారాలు గడుస్తున్నా ఇప్పటి వరకూ పుస్తకాలు లేకుండానే విద్యార్థులకు పాఠాలు చేస్తున్నారని, దీనిని బట్టి విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుందని,డిజిటల్ పాఠాలు కేవలం డిజిటల్ ప్రకటనలకే పరిమితం అయ్యాయాని తెలిపారు . పాఠశాలలో తరగతి గదులు లేక ఒకే గదిలో 3,4 తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించడంపై స్దానిక శాసన సభ్యులు గుడెం మహిపాల్ రెడ్డి పై మండి పడ్డారు.
ఉన్నత పాఠశాలలో నూతన భవన నిర్మాణం కోసం ముడు సంవత్సరాలుగా పనులు పూర్తి కాకపోవడంపై ఆయన మండిపడ్డారు . సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా పాఠశాలలను బాగు చేస్తామని చెప్పి నిధులు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు, శాసన సభ్యులు స్పందించి ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దేవెందర్ గౌడ్, నిజామోద్దీన్, కిశోర్ రెడ్డి, పున్యవతి, ధన్ రాజ్, షకీల్, సాయి,దీపక్, నరేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.