పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
భవిష్య నిధి (ప్రావిడెంట్ ఫండ్ )కి సంబంధించిన ఏ సేవలైన నేరుగా ఆన్ లైన్ లోనే పొందవచ్చని, మొబైల్ మీట నొక్కితే చాలని, ప్రత్యేకించి పీఎఫ్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని పటాన్చెరు ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ విశాల్ అగర్వాల్ అన్నారు. ‘నిధి ఆప్కే నిఖత్ 2.0’ (ప్రజల వద్దనే సమస్యల పరిష్కారం) లో భాగంగా, మంగళవారం పీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ తో పాటు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి ఎ. సిద్దిరాజు, అకౌంట్స్ అధికారి బి.మనోజ్, ఇతర సిబ్బందితో కలిసి గీతం అధ్యాపకులు, సిబ్బందితో ముఖాముఖి నిర్వహించారు. ఫిర్యాదుల పరిష్కారం, సమాచార మార్పిడి, అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు విశాల్ అగర్వాల్ తెలిపారు. భవిష్య నిధి సభ్యులు తను పీఎఫ్ అకౌంట్ ను ఆధార్, పాన్ కార్డులతో అనుసంధానం చేసుకుంటే, ఆన్ లైన్ లో ఎంత మొత్తం నిల్వ ఉంది, నెలవారీ పీఎఫ్ జమ , ఇ-నామినేషన్ వంటి పనులన్నింటినీ మొబైల్ ఫోన్ తోనే చేసుకోవచ్చని, పీఎఫ్ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆయన స్పష్టీకరించారు.
”ప్రయాస్’ పథకం కింద దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు రిటైర్ అయిన రోజే పెన్షన్ పొందే వీలు కల్పిస్తున్నానని, తమకు వచ్చే దరఖాస్తులను రెండు మూడు రోజులలోనే పరిష్కరిస్తున్నట్టు విశాల్ అగర్వాల్ తెలిపారు. గత ఏడాది జనవరి నుంచి ప్రతినెలా 27న ‘నిధి ఆప్కే నిఖత్ పేరిట దేశవ్యాప్తంగా పీఎఫ్ సేనలను ఉద్యోగుల పని ప్రదేశాల్లోనే అందుబాటులోకి తెచ్చి, వారి సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. విస్తృతమైన ప్రజల భాగస్వామ్యంతో, వారు సంతృప్తి సాందేలా పీఎఫ్ సేవలను సమర్ధవంతంగా అందజేస్తున్నట్టు తెలియజేశారు.ఈ సందర్భంగా, ఆన్ లైన్ క్లెయిమ్ లను దాఖలు చేయడం, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడం వంటి ఆన్ లైన్ సేవలను అవ సరార్థులకు అందించడానికి హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారు. తద్వారా ఈపీఎఫ్ అధికారులు, ఉద్యోగులతో పరస్పర చర్చకు, అవగాహన పెంపొందించడానికి, అనుమానాల నివృత్తి చేసుకోవడంతో పాటు పీఎఫ్ సేవలు సులువుగా పొందే వీలు కలిగింది.గీతం రెసిడెంట్ డైరక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, పలువురు అధ్యాపకులు, సిబ్బంది, సహ సిబ్బంది తదితరులు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొని, తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఇటీవల పదవీ విరమణ చేసిన కొందరు ఉద్యోగులకు పెన్షన్ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.