ఏఐజీ ఆస్పత్రి కన్సల్టెంట్ వైద్యురాలు డాక్టర్ పాశం మేధారెడ్డి
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఎవరైనా వ్యక్తి గుండెపోటుకు గురై కుప్పకూలినప్పుడు ప్రతి క్షణమూ విలువైనదని , గుండె పునర్జీవనం కోసం తక్షణమే ప్రయత్నించాలంటూ, ఆయా మెళకువలను ఏఐజీ ఆస్పత్రి కన్సల్టెంట్ వెద్యురాలు డాక్టర్ పాశం మేధారెడ్డి చేసి చూపారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘బేసిక్ బెఫ్ట్ సపోర్ట్ (బీఎల్ఎస్), ప్రథను చికిత్స’ అనే అంశంపై శుక్రవారం నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో ఆమె ప్రధాన వక్తగా, శిక్షకురాలిగా పాల్గొన్నారు. భారత ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ విద్యార్థి విభాగం (ఐపీఏ-ఎస్పీ), ఏఐజీ ఆస్పత్రి, గీతం ఫార్మసీ విద్యార్థుల సంఘం (జీపీఎస్) సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె బీఎల్ ఎస్ ప్రథమ చికిత్స పద్ధతులపై సమగ్ర ప్రసంగం చేసి, వాటిని ప్రదర్శించి చూపారు. గుండెపోటు వచ్చినప్పుడు సీసీఆర్ నిర్వహణ పద్ధతి, తక్షణం స్పందించే తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సీసీఆర్ చేసే విధానం, సమయానుకూల జోక్యం వంటి వాటి ప్రాముఖ్యతను వివరించారు.


గుండెపోటుకు గురైనప్పుడు గోల్డెన్ ఆవర్ గురించి చెబుతూ, తొలి నిమిషంలో గుండె నొక్కుకుంటూ చికాకుగా కనిపిస్తారని, నాలుగు నిమిషాల లోపు మెదడు దెబ్బతినదని, ఆరు నిముషాల లోపు ఆ ప్రమాదం తప్పదని, పది నిమిషాల తరువాత తీర్చలేని నష్టం జరుగుతుందని చెప్పారు.గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రతిస్పందనను ముందుగా తనిఖీ చేయాలని, అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలను అందుబాటులోకి తేవాలని (108కి లేదా ప్రైవేటు అంబులెన్స్కు ఫోన్ చేయడం), శ్వాస-నాడీ స్పందన లేనప్పుడు సీసీఆర్ చేయాలని డాక్టర్ మేధ సూచించారు. సీపీఆర్ పద్ధతులపై ఆచరణాత్మక ప్రదర్శనలను చేసి చూపారు. ఛాతీపై ఉన్న బట్టలను తొలగించి, రెండు చేతులు వంపు లేకుండా నిటారుగా పెట్టి నొక్కాలని, ముప్పై సార్లు నొక్కాక, రెండు మార్లు రోగి నోటిలోకి గాలిని ఊదాలని, అది కొనసాగిస్తూనే ఉండాలని సూచించారు. ఒకరు ఎక్కువ సేపు సీపీఆర్ చేయలేరు కాబట్టి, అందుబాటులో ఉన్నవారు రోగి నుంచి ప్రతిస్పందన వచ్చేవరకు ప్రయత్నించాలన్నారు.అలాగే ఈ మధ్య బహిరంగ ప్రదేశాలలో అందుబాటులో ఉంచుతున్న ఎక్స్ టర్నల్ డీసిబ్రిలేటర్ల వినియోగించే (షాకిచ్చే) విధానాన్ని చూపారు. అధ్యాపకులు, విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆమె జవాబులిచ్చారు. స్కూల్ ఆఫ్ ఫార్మసీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బప్పాదిత్య ఛటర్జీ అతిథిని స్వాగతించగా, డాక్టర్ గూడి శ్రీకాంత్ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ఇందులో ఏఐజీ ఆస్పత్రికి చెందిన డాక్టర్ మరియం, వికాస్, అశోక్ తో పాటు పలువురు గీతం అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. వారందరికీ సర్టిఫికెట్లను ప్రధానం చేశారు.

