పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
హైదరాబాద్, మాతృశ్రీ నగర్లోని శ్రీఆద్య జూనియర్ కళాశాలకు చెందిన 160 మంది 12వ తరగతి ఎంపీసీ విద్యార్థులు, వారి అధ్యాపకులతో కలిసి శుక్రవారం గీతం హైదరాబాద్ ప్రాంగణాన్ని సందర్శించారు. గీతం నిర్వహిస్తున్న పలు కోర్సుల వివరాలతో పాటు అందులో నెలకొని ఉన్న మౌలిక సదుపాయాలు, అత్యాధునిక ల్యాబరేటరీలు, తరగతి గదులు, ప్రపంచ శ్రేణి గ్రంథాలయం, హాస్టళ్లు వంటి వాటిని విద్యార్థులు స్వయంగా పరిశీలించి, ఓ అవగాహనను ఏర్పరచుకున్నారు.శ్రీఆదర్య విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యశాల, అనుభవపూర్వక అభ్యాసాలను గీతం కోర్ ఇంజనీరింగ్ అధ్యాపకులు నిర్వహించారు. తమ అభిరుచికి తగ్గ ఉన్నత విద్యా కోర్సులను ఎంపిక చేసుకోవడానికి ఈ మార్గదర్శనం వారికి ఎంతో ఉపకరించింది. కేవలం విద్యకే పరిమితం కాకుండా సహ, అదనపు పాఠ్యాంశాల ద్వారా సంపూర్ణ పరిణితి సాధించడం ఎలాగో వారు గ్రహించారు. నాణ్యమైన విద్య, పరిశోధన, కార్యనిర్వాహక శిక్షణలో పేరొందిన గీతం, తమ ప్రాంగణాన్ని సందర్శించిన విద్యార్థులకు మరుపురాని అనుభూతిని మిగిల్చింది.సామాజిక బాధ్యతలో భాగంగా, ఇంటర్మీడియెట్ విద్యార్థులు, వారి అధ్యాపకులకు కార్యశాలలు, అధ్యాపక వికాస కార్యక్రమాలను గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. వివిధ అంశాలపై వారి నెపుణ్యాలను, పరిజ్ఞానాన్ని మెరుగుపరచడానికి ఉపకరించేలా వీటిని రూపొందించారు.