తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీ
– కేసీఆర్ పాలనలో అప్పుల రాష్ట్రంగా తెలంగాణ
– ఐఎన్ టియూసీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి
పటాన్ చెరు:
తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీయని ఐఎన్టీయూసీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కె.నరసింహారెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా మంగళవారం స్థానిక బస్టాండ్ ఎదురుగా దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ముందు ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…17 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చేసిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. ప్రాజెక్టుల పేరిట ముఖ్యమంత్రి కేసీఆర్ లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడ్డాడని ఆయన ఆరోపించారు. 7 సంవత్సరాల్లో కనీసం 70 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలకు మాత్రమే నిధులు కేటాయించడం దారుణమన్నారు. సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి సిఎస్ఆర్ ఫండ్స్ నుండే కొంత కేటాయిస్తున్నారే తప్ప, రాష్ట్ర బడ్జెట్ నుండి నిధులు రావడంలేదన్నారు. మిగులు బడ్జెట్ బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని నాలుగు లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్ దేనన్నారు. అమరుల ఆశయాల కొరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరోసారి పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, పట్టణ మాజీ అధ్యక్షుడు మల్లేష్ యాదవ్,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చిన్న ముదిరాజ్, యువరాజ్ మోరే, గాలయ్య తదితరులు పాల్గొన్నారు.